హైదరాబాద్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): బడ్జెట్లో కేటాయించిన నిధులతో ఆరు గ్యారంటీల అమలు సాధ్యమయ్యే అవకాశం లేదని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లోని 13 హామీల అమలుకు ఈ ఏడాది రూ. 1.5 లక్షల కోట్లు అవసరమవుతాయని, కానీ బడ్జెట్లో కేటాయించింది రూ. 53 వేల కోట్లేనని గుర్తుచేశారు. గురువారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ గడచిన పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలుచేసిందని, ప్రజలకు ఇచ్చిన, ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు. తమకంటే మెరుగైన పాలన అందిస్తుందేమోనన్న ఆశతో ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని, వారి ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అందుకే హామీలను పదేపదే గుర్తు చేస్తున్నాం తప్పితే మరో ఉద్దేశం ఏమీ లేదని స్పష్టం చేశారు.
రైతుబీమా అమలు చేస్తారో? లేదో ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేని పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మంజూరుచేసి, ప్రక్రియ పూర్తిచేసిన 21,000 ఉద్యోగాలకే నియామకపత్రాలను ఇస్తున్నారని, ఇవికాకుండా ఎన్నికల హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. ఆసరా పెన్షన్దారులకు ఒక నెల పెన్షన్ పెండింగులో ఉందని, 104 సర్వీసు(అంబులెన్స్) సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు అందడంలేదని, వెంటనే పెన్షన్, వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలేజీ విద్యార్థుల కోసం తమ ప్రభుత్వం ప్రారంభించి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం కూడా నిలిచిపోయిందని తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి నెలనెలా భృతి కల్పించడంతోపాటు చనిపోయినవారికి రూ. 10 లక్షల నష్టపరిహారం అందించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద పేదల ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులకు రూ. మూడు లక్షల చొప్పున మంజూరుచేసిందని, వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వర్తింపజేస్తూ రూ. ఐదు లక్షల చొప్పున ఇవ్వాలని కోరారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఉపాధికోసం పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారని, వారికి వివిధ వృత్తుల్లో శిక్షణ కోసం తన నియోజకవర్గంలో రూ. ఐదు కోట్లతో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ను మంజూరు చేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దుచేసిందని, వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం విధ్వంసం జరిగిందని చెప్పడం పూర్తిగా అవాస్తవమని ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం దివాలా తీస్తే అప్పులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అనేక రంగాల్లో నంబర్ వన్గా నిలిచిందని పేర్కొన్నారు. జాతీయ వృద్ధిరేటుకన్నా తెలంగాణ రాష్ట్రం 2.4శాతం అధిక వృద్ధిరేటు నమోదు చేసిందని గుర్తుచేశారు. తమ హయాంలో పరిశ్రమల స్థాపనకోసం రూ. 2.60 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, కొత్తగా 18 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందని పేర్కొన్నారు. 69 లక్షల మంది రైతులకు రైతుబంధు అమలుచేశామని, రైతుల రుణాలు మాఫీ చేశామని, ఉచిత కరెంటు అందించామని తెలిపారు. సాగునీటి ప్రాజక్టుల ద్వారా సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. డబుల్ లేన్ రోడ్లు, ఫోర్లేన్ రోడ్లు నిర్మించామని, కొత్తగా 1.33 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రభుత్వ భవనాలు నిర్మించామని వివరించారు. కొత్తగా 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేసి ఎంబీబీఎస్ సీట్లను 8,515కి పెంచినట్టు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ ఉచితంగా తాగునీరు అందించామని, పలు రాష్ర్టాలు దీనిని ఆదర్శంగా తీసుకున్నాయని ప్రశాంత్రెడ్డి వివరించారు.