మోర్తాడ్, ఏప్రిల్ 4: నీటి కేటాయింపులు లేని ప్రాంతానికి నాలుగు టీఎంసీల నీటిని వదిలి.. నీటి కేటాయింపులు ఉన్న లక్ష్మీ కెనాల్ ప్రాంతంలోని పంటలు ఎండబెట్టడం సరికాదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఉన్న మండలానికి ఆయువుపట్టు అయిన లక్ష్మీ కెనాల్కు నీటి విడుదలను నిలిపివేస్తే రైతులు ఇబ్బందులు పడుతారని చెప్పారు. పది రోజులపాటు రోజుకు 300 క్యూసెక్కుల చొప్పున 0.3 టీఎంసీల నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఎస్సారెస్పీ ఎస్ఈ, సీఈలను ఆయన కోరారు. ముప్కాల్ మండలానికి చెందిన రైతులు గురువారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో వేములను కలిశారు. లక్ష్మీ కాలువకు నీటిని విడుదల చేయించాలని, చివరి తడికి నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతాయని గోడు వెల్లబోసుకున్నారు. స్పందించిన ప్రశాంత్రెడ్డి.. రైతుల ముందే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. తనతోపాటు రైతులు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా కాంగ్రెస్ ప్రభుత్వం.. నీటి అలకేషన్ లేని ప్రాంతాలకు వరదకాలువ ద్వారా 4 టీఎంసీల నీటిని కిందికి వదిలిందని వివరించారు. అలకేషన్ ఉన్న లక్ష్మీ కెనాల్కు నీటిని విడుదలను నిలిపివేసి, చౌట్పల్లి హన్మంత్రెడ్డి, నవాబ్లిఫ్ట్ల ఆయకట్టు రైతన్నలకు సాగునీరు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని చెప్పారు. రైతుల కోరిక మేరకు లక్ష్మీ కెనాల్కు నీటి విడుదల కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.