నల్లగొండ : కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ శాసన సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్(Mla Ravindra kumar) కోరారు. మంగళవారం దేవరకొండ మండలం మర్రిచెట్టు తండాలో నిర్వహించిన కంటి వెలుగు(Kanti Velugu) కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ సంపూర్ణ అంధత్వ నిర్మూలన ప్రభుత్వం(Eradication Blindness) లక్ష్యమని వెల్లడించారు. మానవ శరీరంలో అన్నిటి కంటే ప్రధానమని తెలిసి కూడా కంటి చూపు పట్ల నిర్లక్ష్యం వహిస్తూ శాశ్వతంగా చూపు కోల్పోతున్న లక్షలాది మందిని చైతన్యపరిచే, ఆదుకోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆలోచనల నుంచి పుట్టినదే కంటి వెలుగు అని ఆయన అన్నారు.
ప్రభుత్వమే నేరుగా పట్టణ, గ్రామాల్లోకి వెళ్లి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని, కంటి వెలుగు ఉద్యమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మారుపాకుల అరుణ సురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నేనావత్ శ్రీను నాయక్, ఎంపీడీవో శర్మ, ఎంపీటీసీ కొర్ర గౌతమిరాంసింగ్, గ్రామ శాఖ అధ్యక్షుడు బావోజి, బొడ్డుపల్లి కృష్ణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.