హైరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసుపై ఈడీ అధికారులు తనను విచారించారని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి పేర్కొన్నారు. రెండోరోజైన మంగళవారం హైదరాబాద్లో ఈడీ అధికారులు 8 గంటలపాటు ఆయనను విచారించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత విషయాలతోపాటు మొయినాబాద్ ఫాంహౌజ్లో బీజేపీ దొంగస్వాముల వేషంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎలా ప్రయత్నించారని అధికారులు ఆరా తీశారని చెప్పారు. ‘ఇది పూర్తిగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన విచారణ మాత్రమే’అని ఈడీ అధికారులు చెప్పారని తెలిపారు.
అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానని, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోనే ఈడీ నోటీసులు ఇచ్చిందని అధికారుల తీరుతో స్పష్టమైందని తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని తాను ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదులోని అంశాలను కాకుండా ఫిర్యాదుదారుడినైన తనను ఈడీ ప్రశ్నించటం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని బయటపెట్టినందుకే బీజేపీ కక్షగట్టిందని ఆరోపించారు. అయ్యప్ప దీక్షలో ఉన్నా చట్టాన్ని గౌరవించే బాధ్యతగల పౌరుడిగా ఈడీ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పానని, 27న మళ్లీ హాజరు కావాలని అధికారులు కోరారని పేర్కొన్నారు.