జనగామ, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : ధాన్యం ధరను తగ్గించారని ఆరోపిస్తూ బుధవారం సాయంత్రం రైతులు జనగామ మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యదర్శి, ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ధాన్యం క్వింటాల్కు రూ.2,200 మద్దతు ధర కల్పించాల్సి ఉండగా, మంగళవారం వరకు రూ.1,900 చొప్పున కొనుగోలు చేశారు. బుధవారం ఆలస్యంగా వేలం పాటలను ప్రారంభించిన వ్యాపారులు తేమ, తాలు శాతం అధికంగా ఉందన్న కుంటిసాకులు చెప్పి 10 వేల బస్తాలను ఆన్లైన్లో రూ.1,500కు తగ్గించి కొనుగోళ్లకు సిద్ధం కావడంతో రైతులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ‘మీ వెంట నేనుంట. ఎట్లా కొనరో చూద్దాం.. రేపు సెలవైనా యార్డులో ఉన్న ధాన్యం అంతా మద్దతు ధరకు కొనాలి.. లేకుంటే యార్డుకు వచ్చి కూర్చుంట’ అని రైతులకు మద్దతు ప్రకటించారు. మద్దతు ధర, కొనుగోళ్లలో జాప్యం, వ్యాపారుల సిండికేట్ వంటి అంశాలపై రైతులతో కలిసి సంబంధిత అధికారులను ఎమ్మెల్యే నిలదీశారు.
మార్కెట్ కార్యదర్శి సస్పెన్షన్
ఆన్లైన్లో ధాన్యం ధర తగ్గించి కొనుగోళ్లకు సిద్ధమైన వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు బాధ్యుడైన మార్కెట్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ ఆదేశించారు. మార్కెట్కు వచ్చిన అదనపు కలెక్టర్ను రైతులు చుట్టుముట్టి.. వ్యాపారులు తమను నిండా ముంచుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.