హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): బిల్కిస్ బానో లైంగికదాడి కేసు దోషుల విడుదల వ్య వహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. దోషుల విడుదలకు గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విడుదల దోషులకు స్వాగతం పలకడం సమాజానికి చెంపపెట్టు వంటిదని మండిపడ్డారు. ఇలాంటి ప్రమాదకర సంప్రదాయాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నదని గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు. బిల్కిస్ బానో లైంగికదాడి కేసులో జీవితఖైదు పడ్డ 11 మంది దోషులను రెమిషన్ విధానం కింద పంద్రాగస్టునాడు విడుదలచేయడం, వారి కుటుంబసభ్యులు మిఠాయిలు తినిపించి, పూల దండలతో స్వాగ తం చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
ఇలాంటి తీవ్రమైన నేరాలు చేసిన వారిని స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలచేయడం ఆ రోజుకు ఉండే పవిత్రతకు కళంకం అని కవిత ఆవేదన వ్యక్తంచేశారు. రేపిస్టులు, యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించరాదని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ.. గుజరాత్ ప్రభుత్వం వారిని విడిచిపెట్టడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. గుజరాత్ ప్రభుత్వ కర్కశత్వానికి ఇది నిదర్శనమన్నారు. బిల్కిస్ బానో అనుభవించిన బాధను, వేదనను ఒక మహిళగా తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. పౌరులకు చట్టంపై విశ్వాసం సన్నగిల్లకుండా ఉండటానికి సిగ్గుమాలిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.