Jagga Reddy | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల నుంచి రిగ్గింగులు చేసి గెలిచిన చరిత్ర తనదని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి నిస్సిగ్గుగా, బాహాటంగా చెప్పుకున్నారు. ఆయన బుధవారం ఎన్టీవీ క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో పాల్గొని తన మనసులో మాటలు బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెట్టిన ఐపీఎస్, ఐఏఎస్ల లిస్టు తమ దగ్గర ఉన్నదని అధికారంలోకి రాగానే ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
‘ఇకనైనా తెలివి తెచ్చుకోండ్రా పిచ్చి సన్నాసుల్లారా’ అంటూ అనుచితంగా వ్యాఖ్యానించారు. 1995 మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి సపోర్టుగా పోలీసులు రిగ్గింగ్ చేస్తే.. వాళ్లను కొట్టి, తిరిగి తాము రిగ్గింగ్ చేసి గెలిచినట్టు వెల్లడించారు. మరో మున్సిపల్ ఎన్నికల్లో తాను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కారునే గుద్దేసి.. ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించానని తన రౌడీయిజాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. అధికారంలోకి వస్తే ఐపీఎస్లను, ఐఏఎస్లను బెదిరించే స్వేచ్ఛ కూడా లేదా అంటూ విలేకరులను ఎదురు ప్రశ్నించారు. డీఎస్పీలు, ఎస్సైలు, సీఐలు, కానిస్టేబుళ్ల అంతుచూస్తామని హెచ్చరించారు.
టికెట్లు రానోళ్లే నిందలేస్తున్నరు..
కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థులకు ఓడిపోయే చోట్ల మాత్రమే టికెట్లు ఇచ్చిందని, గెలిచేచోట రెడ్డి కులస్తులకు ఇచ్చుకున్నారని జర్నలిస్టులు ప్రశ్నించగా.. జగ్గారెడ్డి నీళ్లు నమిలారు. ఏ బీసీ నాయకుడు కూడా అసంతృప్తితో లేడని అంటూనే.. టికెట్లు దక్కనివారే తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ‘కాంగ్రెస్ పార్టీలో సీఎం కావాలని చాలామందికి ఉంటుంది. అడిగితే.. తొక్కుడు తొక్కి పడేస్తారు’ అంటూ అధిష్ఠానం నియంతృత్వ విధానాన్ని వెల్లడించారు. తెలంగాణ సీఎం విషయంలో రాహుల్ గాంధీ చెప్పిందే ఫైనల్ అని స్పష్టం చేశారు.
మాది అత్తా కోడళ్ల పంచాయితీ
పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టిన రేవంత్తో మూడు నెలల వరకూ వివాదం ఉందని.. ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలంతా ఎలాంటి విభేదాలు లేకుండా కలిసిపోయామని జగ్గారెడ్డి చెప్పారు. మరోవైపు దామోదర్ రాజనర్సింహది తనది అత్తా కోడళ్ల పంచాయితీ అని అన్నారు చాలాసార్లు ఆవేశంగా మాట్లాడానని.. పార్టీకి రాజీనామా చేస్తానని ఎన్నడూ బెదిరించలేదని అన్నారు. వైఎస్ హయాంలో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉండేదని, ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి వస్తే తనకు మంత్రి పదవి వస్తదనే ఆలోచన కూడా లేదని అన్నారు.