హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): దళితబంధు ఒక విప్లమమని, ఈ పథకాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ దళిత బాంధవుడని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కొనియాడారు. మంగళవారం శాసనసభలో దళితబంధుపై చర్చను కిశోర్ ప్రారంభిస్తూ.. ఇదొక దళిత జనోద్ధరణ ఉద్యమమని చెప్పారు. ఈ పథకాన్ని రచించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలతో పాటు జై భీమ్లు తెలిపారు. దళితబంధు భారతదేశానికే దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు. తెలంగాణలో అంబేద్కర్ ఆశయ సాధనను కొనసాగిస్తున్నామన్నారు. గరీబీ హఠావో నినాదం పేరుతో ప్రచారమే తప్ప అమలు చేయలేదని చెప్పారు. దళితుల జీవితాలు మారలేదని ప్రతిపక్షాలపై కిశోర్ విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలకు సేవ చేద్దామన్న ఆలోచన లేదని, రూపాయి ఇద్దామన్న ఆలోచన లేనేలేదని, దళితులను ఓటుబ్యాంక్గా వాడుకోవాలన్న యావ తప్ప మరొకటి లేదని చురకలంటించారు. దళితబంధు తరహాలోనే అందరికీ ఇవ్వాలంటున్న వాళ్లు కేంద్రం నుంచి 50% నిధులు తేవొచ్చు కదా అని నిలదీశారు. తెలంగాణలో అన్ని కులాలు, మతాల అభివృద్ధికి తాము దశలవారీగా పాటుపడుతున్నామని తెలిపారు. సంకుచిత స్వభావంతో కొందరు విద్వేషాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.