Etela Rajender | ములుగు: కాంగ్రెస్తోపాటు బీజేపీ సభల్లో కూడా జనం కనిపించడంలేదు. ఆ పార్టీ చెప్పే మాటలు వినడం ఇష్టం లేక ప్రజలు ముఖం చాటేస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం బీజేపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ చేపట్టిన ఎన్నికల సభలో ముఖ్య అతిథిగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నా.. ఆ సభ జనం లేక వెలవెలబోయింది.
ఈటల రాజేందర్ మాట్లాడుతుండగానే జనం ఇంటి దారి పట్టారు. గెలిస్తే ఏంచేస్తామో చెప్పకుండా సీఎం కేసీఆర్పై విమర్శలకే ఈటల పరిమితం కావడంతో ప్రజలు లేచివెళ్లిపోయారు. రాజేందర్తోపాటు మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు సైతం చెప్పిందే పదే పదే చెప్తూ సభకు వచ్చిన జనాల సహనాన్ని పరీక్షించారు. దీంతో ప్రజలందరూ ఒక్కొక్కరుగా జారుకోవడంతో బీజేపీ సభ తుస్సుమన్నది. అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ.. రెండు జాతీయ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని బుధవారం నిర్వహించిన సభల సాక్షిగా తేలిపోయింది.