ఖలీల్వాడి, నవంబర్ 24: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘానికి విరాళాన్ని అందించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలను అభినందిస్తూ పట్టణ సంఘ భవనానికి వారి తండ్రి జ్ఞాపకార్థం బిగాల కృష్ణమూర్తి భవన్గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా సంఘ భవనం ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.25,11, 116 విరాళం చెక్కును గణేశ్ గుప్తా, మహేశ్ బిగాల అందజేశారు. గణేశ్ గుప్తా మాట్లాడుతూ రూ. 1.50 కోట్లతో పట్టణ ఆర్యవైశ్య సంఘ భవన నిర్మాణం జరుగుతున్నదని, కొద్దిరోజుల్లోనే భవనం పూర్తవుతుందన్నారు.
తమ తండ్రి దివంగత బిగాల కృష్ణమూర్తి మనతో లేకపోయినా వారి జ్ఞాపకార్థం సం ఘ భవన నిర్మాణానికి విరాళం అందజేశామన్నారు. తమ తండ్రికి విద్య, అన్నదానం కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడమంటే ఎంతో ఇష్టమన్నారు. మాక్లూర్ గ్రామంలో సకల సౌకర్యాలతో శ్మ శానవాటిక నిర్మించామన్నారు. తమ తండ్రి జ్ఞాపకార్థం వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మహేశ్ బిగాల పేర్కొన్నారు. కాగా, ఈ సందర్భంగా ఎమ్మె ల్యే బిగాల గణేశ్ గుప్తా, మహేశ్ బిగాలను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.