నల్లగొండ : నల్లగొండ నియోజక వర్గంలో ఇప్పటివరకు రూ. 1300 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Mla Bhupal Reddy) స్పష్టం చేశారు. ఈ విషయంలో చర్చకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. గురువారం నల్లగొండ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్(IT Hub) వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
చేసిన అభివృద్ధి కాంగ్రెస్ నాయకులకు (Congress Leaders) కనబడటం లేదని విమర్శించారు. కోమటిరెడ్డి కి మతిస్థిమితం లేక పూటకో మాట, రోజుకో పార్టీ మారుతున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్(Komati Reddy Briothers) అభివృద్ధి నిరోదకులుగా మారారని పేర్కొన్నారు. అనవసర విషయాల్లో తనపై బురద జల్లుతున్నారని, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), ఐటీ మంత్రి కేటీఆర్(IT Minister KTR), జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy )ల సహకారంతో పట్టణంలో ఐటీ హబ్ మంజూరయిందని వెల్లడించారు. ప్రస్తుతం ఐటీ హబ్ నిర్మాణ పనులు 90 శాతం పూర్తి కాగా మరో మూడు నెలల్లో ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే 16 కంపెనీలు నల్లగొండ ఐటీ హబ్ లో తమ బ్రాంచ్ లు నెలకొల్పుతామని ఒప్పందం చేసుకున్నాయని, దీని ద్వారా మొత్తం 3 వేల మంది యువత కు ఉపాధి లభిస్తుందని అన్నారు.
పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ(Medical College) భవనం కూడా పూర్తి కావొస్తున్నదని, మెడికల్ కాలేజీ కి ప్రొఫెసర్ లు, డీన్ లు, డాక్టర్ లను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. జూన్ మొదటి వారంలో మంత్రి కేటీఆర్ 139 కోట్ల రూపాయలతో నల్లగొండ పట్టణంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేయనున్నారని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు.