హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): బీజేపీ దేశానికి పట్టిన పీడ అయితే.. బండి సంజయ్ రాష్ర్టానికి దాపురించిన శని అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్ని వేషాలు వేసినా, ఎంతగా రెచ్చగొట్టినా బీజేపీ అసెంబ్లీ గేట్ను కూడా తాకలేదని స్పష్టం చేశారు. బండి సంజయ్ కొల్లాపూర్లో సీఎం కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శుక్రవారం హైదరాబాద్ తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్న బీజేపీని తరిమికొట్టేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని చెప్పారు. మోదీ సర్కారును చీల్చి చెండాతున్నారనే అక్కసుతోనే బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
రాజకీయ ఉనికి కోసమే బండి నోరుపారేసుకుంటున్నాడని, సీఎం కేసీఆర్పై ఇష్టారీతిగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జరిగిన అభివృద్ధికి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందనడానికి కేంద్రం ఇచ్చే అవార్డులే నిదర్శమని ఆయన అన్నారు. కొల్లాపూర్లో రెండురోజులు ఉండి గ్రామాలు ఎట్లా అభివృద్ధి చెందాయో చూడాలని.. తెలంగాణ రాకముందు, ఇపుడు కొల్లాపూర్ ఎలా ఉన్నదో అక్కడి ప్రజలను అడిగి తెలుసుకోవాలని హితవుపలికారు. రాజ్యాంగబద్ధ సంస్థలు బీజేపీ జేబు సంస్థల్లా మారాయని.. సీబీఐ, ఈడీ, ఐటీ ఎవరిపై దాడులు చేస్తాయో బీజేపీ నేతలకు ముందే తెలిసిపోతున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర అప్పుల విషయంలో గొంతు చించుకొంటున్న బండి సంజయ్, ఎంపీగా రాష్ర్టానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంటే.. రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నదని హర్షవర్ధన్రెడ్డి వివరించారు.