అచ్చంపేట: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధి పులిజాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిర్వహించిన రైతు నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఉచిత విద్యుత్తులో తెలంగాణ రాష్ట్రం దేదీప్యమానంగా వెలుగొందుతుంటే, పరాయి పాలకులు, కిరాయి నేతల కాంగ్రెస్ పార్టీ కళ్లు మండుతున్నాయని విమర్శించారు.
వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు శిశ్యుడు రేవంత్ రెడ్డి చంద్రభూతం లెక్క తెలంగాణను పట్టుకుని పీడిస్తున్న పెనుభూతంగా మారిండని, రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారని తెలిపారు. ఈ వెలుగులను ఆర్పాలని, రైతులను చీకట్లో పాము కాటుకు, కరెంటు షాక్ కు బలి చేయాలని, తెలంగాణ వ్యవసాయాన్ని తేరుకోకుండా చేయాలని అధికారం హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలు బట్టబయలు అవుతున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ ఉచితంగా కరెంటు ఇచ్చి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, రైతుబంధుతో పెట్టుబడి సాయం అందించి, రైతు బీబీ తీసుకొచ్చి, రైతు వేదికలు నిర్మించి, రైతు కల్లాలు ఏర్పాటు చేసి, పండిన పంటను కొనుగోలు కేంద్రాలతో ధాన్యం మొత్తం సేకరించి తెలంగాణలో రైతులు మూడు పంటలతో ముచ్చటగా మురిసిపోయేటట్లు చేస్తున్నరని వివరించారు.
అమెరికాలో కాంగ్రెస్ రైతు వ్యతిరేక కుట్రలు రేవంత్ రెడ్డి రూపంలో బయటపడడంతో తెలంగాణ రైతులు భగ్గు మంటున్నారని, కరెంటు వ్యతిరేక కాంగ్రెస్ తీరుపై రైతన్నలు కదం తొక్కుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం, ఎల్లమ్మ ఆలయం నిర్మాణాలకు సహాయ సహకారాలు అందజేస్తునని, విద్యుత్ సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.