TSRTC | హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీ సంస్థ లాభాల బాట పట్టేందుకు యాజమాన్యం వినూత్న ఆలోచనలతో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. ఆర్టీసీ నూతనంగా కొనుగోలు చేసిన లహరి ఏసీ స్లీపర్ బస్సులను సోమవారం హైదరాబాద్ ఎల్బీనగర్లో సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ అత్యాధునిక హంగులతో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఇటీవలే 756 సూపర్ లగ్జరీ బస్సులను కొనుగోలు చేసిందని, వాటికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నదని వివరించారు. ప్రైవేట్కు దీటుగా అమ్మఒడి అనుభూతి ట్యాగ్లైన్తో సంస్థ తీసుకొచ్చిన లహరి ఏసీ స్లీపర్ బస్సులను ప్రజలు ఆదరించాలని కోరారు. త్వరలో ఎలక్ట్రిక్ బస్సులనూ సంస్థ సమకూర్చుకుంటుందని చెప్పారు. హైదరాబాద్లాంటి నగరాల్లో మెట్రోకు ఆర్టీసీ బస్సులకు అనుసంధానం చేసి ప్రయాణికులను ఆకర్షించాలని సూచించారు. ఆర్టీసీని ప్రజలకు మరింతగా చేరువ చేయడంలో ఎండీ వీసీ సజ్జనార్ చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు.
త్వరలోనే మరో 100 ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తామని, పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఏప్రిల్లో అందుబాటులోకి తెస్తున్నామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మొదట హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడుపుతామని చెప్పారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన లహరి బస్సుల్లో సీట్లను www.tsrtconline.inలో బుక్ చేసుకోవాలని సూచించారు. టీఎస్ఆర్టీసీ తలపెట్టిన భద్రాద్రి తలంబ్రాల కోసం ఆదిమంత్ర కన్సల్టెన్సీ ప్రతినిధి పొట్లపల్లి శ్రీరాం, మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి టికెట్లను బుకింగ్ చేశారు. వారికి ఎండీ బుకింగ్ రశీదులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ సీవోవో డాక్టర్ వీ రవీందర్, జేడీ సంగ్రామ్సింగ్జీ పాటిల్, ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ పంకజ, డీసీపీ సాయిశ్రీ, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్కుమార్, పురుషోత్తం, సీపీఎం కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవనప్రసాద్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ యాక్సిడెంట్ ఫ్రీ కార్పొరేషన్గా మారబోతుందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని జూబ్లీ బస్స్టేషన్ ప్రాంగణంలో సోమవారం ఆర్టీసీ చాలెంజ్ ఫర్ ట్రైనింగ్ (టాక్ట్) శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టాక్ట్లో భాగంగా ఏప్రిల్ నెలలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్ సహా అన్ని విభాగాల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. అనంతరం పుష్పక్ ఎయిర్ పోర్ట్ బస్ కంట్రోల్ పాయింట్ను ఎండీ ప్రారంభించారు.