హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు(Assembly meetings) జరుగుతున్న తీరుపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో కులగణన (Caste census) తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. సభా కార్యకలాపాలను కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయిస్తుందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సభా సాక్షిగా తన అసంతృప్తిని వెల్లగక్కారు.
పార్టీలను విశ్వాసంలోకి తీసుకోనప్పుడు బీఏసీ ఎందుకు అని సూటిగా ప్రశ్నించారు. బీఏసీలో చెప్పని అంశాలపై ఎందుకు చర్చ పెట్టారని నిలదీశారు. సభలో బిజినెస్ ఏముంటుందో ముందుగా తెలియడం లేదన్నారు. 13వ తేదీ వరకు మాత్రమే బీఏసీ సమావేశాల్లో చర్చించారన్నారు.
ఆ తర్వాత అసెంబ్లీలో ఏం జరుగుతుందో సమాచారం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనకు తాము మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. న్యాయపరమైన సమస్యలు ఎదురుకాకుండా చూడాలన్నారు. అలాగే సమగ్ర సర్వే వివరాలతో ఎవరికి ప్రయోజనం కలిగిందో ప్రభుత్వం వెల్లడించాలన్నారు.