వరంగల్ చౌరస్తా, మే 12: ఎంజీఎంలో సరైన వైద్యసేవలు అం దుబాటులో లేవని, వైద్య అవసరాలకు తగిన వసతులు లేవని కొన్ని న్యూస్ చానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ఖండించారు. కొందరు వ్యక్తులు పనిగట్టుకొని ఎంజీఎంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని, వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా దుష్ప్రచారం చేయడం సరికాదని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముత్యాలపాడు గ్రామానికి చెందిన మాలోత్ లక్ష్మికి రక్త ప్రసరణ లేకపోవడంతో 2022 నవంబర్ 10న అత్యవసర పరిస్థితిలో శస్త్రచికిత్స చేసి కాలు తొలగించారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి బుధ, శనివారాల్లో అందుబాటులో ఉండే ఆర్థోపెడిక్ 3వ యూనిట్ ద్వారా వైద్యసేవలు పొం దుతున్నది. శుక్రవారం రివ్యూ ఓపీకి వచ్చిన బాధితురాలికి వైద్యసేవలు (డ్రెస్సింగ్, పరీక్షలు, మందులు) అందించారు. తిరుగు ప్రయాణం కోసం పేషెంట్ కేర్ సిబ్బంది వీల్చైర్ ద్వారా ఎంజీఎం ఆవరణలో చెట్టు కింద ఉన్న గద్దె వద్దకు చేర్చారు.
ఎంజీఎంలో కృత్రిమ కాలు ఏర్పాటు అంశం విషయాన్ని తెలుసుకోవడం కోసం బాధితురాలి భర్త లచ్చులు కాలిపర్స్ సెంటర్ (కృత్రిమ అవయవ ఏర్పాటు కేంద్రం) వద్దకు వెళ్లాడు. 3వ యూనిట్ వైద్యుల బృందం శనివారం అందుబాటులో ఉంటుందని, శనివారం పరీక్షలు చేయించుకొని ఇక్కడికి రావాలని సిబ్బంది చెప్పడంతో అప్పటి వరకు ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో.. నడవలేని తన భార్యను భుజాలపై మోస్తూ మరోచెట్టు నీడకు తరలిస్తున్న లచ్చులును కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను పనిగట్టుకొని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని సూపరింటెండెంట్ తెలిపారు. శనివారం కృత్రిమ కాలు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎంవోను ఆదేశించామని తెలిపా రు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఎంజీఎం సేవలు, అధికారుల పనితీరుపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు.