హైదరాబాద్ : గ్రూప్ -1 పాఠ్యాంశాల్లో తెలుగు అకాడమీ అధికారులు స్పల్ప మార్పులు చేశారు. తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీ పుస్తకాల్లో వర్తమాన అంశాలకు చోటు కల్పించారు. ఈ మేరకు తెలుగు అకాడమీ కసరత్తును పూర్తిచేసింది. ఇప్పటికే తెలంగాణ జాగ్రఫీ పుస్తకం అందుబాటులోకి తేగా, ఎకానమీ పుస్తకం సిద్ధమవుతున్నది. పది రోజుల్లో ఈ పుస్తకం ముద్రణ పూర్తయి.. అందుబాటులోకి రానున్నది. ఇటీవలే 503 గ్రూప్ -1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. సిలబస్ను గతంలోనే ఖరారుచేయగా, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు పుస్తకాల్లో స్వల్పమార్పులు చేశారు.
నోటిఫికేషన్ల నేపథ్యంలో తెలుగు అకాడమీ పుస్తకాలకు తీవ్ర డిమాండ్ ఉంటున్నది. ఉద్యోగార్ధులు తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలనే ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో పుస్తక విక్రయాలు పెరిగాయి. గత నెలన్నర రోజుల వ్యవధిలో లక్షకు పైగా పుస్తకాలను విక్రయించినట్లుగా తెలుగు అకాడమీ అధికారులు వెల్లడించారు. ఇక తాజా డిమాండ్ నేపథ్యంలో పుస్తకాలను పునః ముద్రణకు సన్నాహకాలు చేస్తున్నారు. ఇటీవలే ముద్రణకవసరమయ్యే పేపర్ను సమీకరించేందుకు టెండర్లు పూర్తిచేశారు. 10 రోజుల్లోగా కొత్త పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.