రవీంద్రభారతి, మే 28: చరిత్ర పరిశోధనలు, సాహి త్య రచనలు, కవితా సంకలనాలతో సామాజికవేత్తగా, పత్రిక అధినేతగా బహుముఖీనమైన పాత్ర పోషించిన సురవరం ప్రతాప్రెడ్డి తెలంగాణ జాతి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన తేజోమూర్తి అని మంత్రులు వి.శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి ఉత్సవాలు శనివారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు డాక్టర్ కె.ఐ.వరప్రసాద్రెడ్డి, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ ఆర్.శేషశాస్త్రి, డాక్టర్ జుర్రు చెన్నయ్యలకు సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాలు, నగదును అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన జయంతిని నిర్లక్ష్యం చేశారని, స్వరాష్ట్రంలో వారి జయంతి, వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో కులం, మతం పిచ్చిరేపుతున్నారని, ఇలాంటి సమయంలో ప్రతాపరెడ్డి లాంటి మహనీయుల జీవిత చరిత్ర ప్రజల్లోకి తీసుకెళ్తే కొంత మార్పు వస్తుందన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ప్రాజెక్టు లేదా ఇతర కట్టడాలకు ప్రతాపరెడ్డి పేరు పెట్టే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ చైతన్యానికి ప్రతీక అయిన సురవరం ప్రతాపరెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తి అన్నారు.
ఏకకాలంలో ఒక వ్యక్తి భిన్న వ్యవస్థలకు , భిన్నరూపాలలో దర్శనమివ్వడం ప్రతాపరెడ్డికే సాధ్యమన్నారు. ‘సురవరం అనంతరం తెలంగాణ’ పేరుతో మరో సంకలనాన్ని సెప్టెంబర్లో తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సురవరం ప్రతాపరెడ్డి షార్ట్ డాక్యుమెంటరీలను రూపొందించిన దర్శకులు, కళాకారులకు నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ సభ్యులు సురవరం కృష్ణవర్ధన్, సురవరం పుష్పలత తదితరులు హాజరయ్యారు.