హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ మహబూబ్నగర్ టౌన్/ అర్బన్, సెప్టెంబర్ 21: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొండాలక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని కొనియాడారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్బాపూజీ చిత్రపటానికి మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎనుగొండలోని జేజేఆర్ గార్డెన్స్లో కొత్త పింఛన్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాపూజీ సేవలు ఆచరణీయమని పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, తెలంగాణ ఉద్యమంలో సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత గొప్ప నాయకులు, గొప్ప వ్యక్తులు, వారి త్యాగాలను స్మరించుకోవాలని, వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా మారుమూల గ్రామంలో జన్మించి, పీడిత ప్రజల విముక్తి కోసం బహుముఖ పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరం యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లోని జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 10వ వర్ధంతి సభ నిర్వహించారు. తొలుత బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో బాపూ జీ కృషిని స్మరించుకున్నారు. ప్రజల పట్ల నిబద్దత, కార్యదక్షతతో, నిజాయితీగా రాజకీయాల్లో రాణించారని, హుందాగా వ్యవహరించారని, నేటి తరానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సమితి కోర్ కమిటీ సభ్యులు దొంతు ఆనందం, దోనేటి కృష్ణలత తదితరులు పాల్గొన్నారు.