ఖమ్మం వ్యవసాయం/బోనకల్లు, ఫిబ్రవరి 1: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే ఉత్పాదక రంగాల్లో సంపదను పెంచుకున్నదని, తిరిగి ఆ ఫలాలను ప్రజలకు చేర్చిందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి నిరంజన్రెడ్డి హాజరయ్యారు. అనంతరం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కోలాహలం నాగరాజు, మార్కెట్ సెక్రటరీ రుద్రాక్ష మల్లేశం కలిసి నూతన చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, వైస్ చైర్మన్ షేక్ అఫ్జల్, పాలకవర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.
అనంతరం ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని చెప్పారు. ఖమ్మం ఏఎంసీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అలాగే.. ముదిగొండ మండలం మాదాపురంలో నిర్మించిన రైతు వేదికను పువ్వాడ అజయ్కుమార్తో కలిసి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ వీపీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.