హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో మరోసారి చర్చలు జరిపేందుకు తెలంగాణ మంత్రుల బృందం శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నది. మంత్రులు ఎస్ నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, జగదీశ్వర్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డి, పలువురు ఎంపీలు ఈ బృందంలో ఉన్నారు. కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్తోపాటు ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్మెంట్ కోసం రాష్ట్ర అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. యాసంగిలో బాయిల్డ్రైస్ కొనేది లేదని చెప్పిన కేంద్రం రా రైస్ విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వలేదు. వానకాలానికి కేంద్రం నిర్దేశించిన కోటా మేరకు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఇంకా సుమారు 20 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనాలున్నాయి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోగా, రాష్ట్రంలో బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడి సమస్యను జటిలం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో అనేకసార్లు చర్చలు జరిపారు. ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాన్ని ఒప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మరోసారి చర్చలు జరిపేందుకు రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లింది.