హైదరాబాద్ : ఈ నెల 25, 26న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అరణ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. బోనాలు సమర్పించేందుకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే క్యూలైన్లపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని, దేవాలయాల వద్ద లైటింగ్ వంటి సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లు చేయాలన్నారు.
ఆలయానికి వచ్చే దారులన్నీ సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రత పరంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయడమే గాకుండా ట్రాఫిక్ క్రమబద్దీకరణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి జరుగకుండా భక్తులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
దీనిపై వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. బోనాల జాతర ప్రశాంతంగా, ఘనంగా జరిగేందుకు వీలుగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, పర్యాటక అభివృద్ధి శాఖ ఎండీ మనోహర్, దేవాదాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు
కోహ్లిని మించిన బాబర్ ఆజం.. పాకిస్థాన్ కెప్టెన్ కొత్త రికార్డు
బైక్ను ఢీ కొట్టిన లారీ..ఇద్దరు అన్నదమ్ముల మృతి