నిజామాబాద్, నవంబర్ 7 : మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఎందుకు లేవో విపక్ష పార్టీల కార్యకర్తలు ఆలోచించాలని మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి(Minister Vemula ) అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని కుకునూర్, కోమన్పల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విపక్ష పార్టీల కార్యకర్తలు కర్ణాటక వెళ్లి చూసి వస్తే అసలు విషయం అర్థమవుతుందన్నారు.
తాను చెప్పేది అబద్ధమైతే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ముక్కు నేలకు రాస్తానన్నారు. తెలంగాణ పథకాలు అక్కడ లేవని అర్థం చేసుకుంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఆర్అండ్బీ శాఖ మంత్రిగా తాను చేసిన అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలిచిపోయి తరతరాలకు ఉపయోగపడుతాయన్నారు. వందలాది మందికి వైద్య సేవల కోసం సీఎంఆర్ఎఫ్ సాయం అందించానన్నారు.
రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ ఉన్నట్లే కేంద్రంలో ప్రధానమంత్రి సహాయనిధి కూడా ఉంటుందని, ప్రధాని సహాయనిధి నుంచి బీజేపీ ఎంపీ అరవింద్ ఎంతమందికి ఇప్పించారో చెప్పాలన్నారు.
వాస్తవాలు ఇలా ఉంటే గుడ్డిగా బీజేపీ మాయమాటలు విని మోసపోవద్దని యువతకు పిలుపునిచ్చారు. మరోసారి ఆశీర్వదించి బీఆర్ఎస్ను గెలిపిస్తే ఐదేండ్లలో ఇప్పుడున్న రూ.2 వేల పింఛన్ రూ.5 వేలకు, రూ.10 వేల రైతుబంధు రూ.16 వేలకు పెరుగుతుందన్నారు.
మోదీ సిలిండర ధర ఎంత పెంచినా కేసీఆర్ రూ.400లకే సిలిండర్ బుడ్డి అందిస్తారన్నారు. రేషన్ షాపుల ద్వారా ఇకపై సన్నబియ్యం పంపిణీ చేస్తారని, ఎటువంటి పింఛన్ రాని మహిళలకు ప్రతినెలా రూ.3 వేలు అందిస్తారన్నారు. మరోసారి ఆశీర్వదించి కేసీఆర్ను, తనను గెలిపించాలని మంత్రి వేముల కోరారు. ఆయా గ్రామాల్లో మహిళలు బోనాలతో ఘనస్వాగతం పలికారు.