నిజామాబాద్ : సీఎం కేసీఆర్ అనవసరంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నడంటా..? కాంగ్రెస్ వాళ్లు 3గంటలు ఇస్తరట. అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టాలని చూస్తున్న వారిని తరిమి కొట్టాలని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
జిల్లాలోని మోర్తాడ్ మండలంలో సుమారు 10 కోట్ల వ్యయంతో చేపట్టే బి.టి రోడ్డు నిర్మాణ పనులకు గురువారం శంకుస్ధాపన చేశారు. 2.90 కోట్లతో తక్కురూ వాడ నుంచి కుకునూర్ లింక్ వరకు బి.టి రోడ్ నిర్మాణం పనులకు మోర్తాడ్ పెద్దవాగు రోడ్డు పై శంకుస్థాపన, 6.80 కోట్ల వ్యయంతో మోర్తాడ్ నుంచి బషీరాబాద్ వయా వడ్యాట్ బి.టి రోడ్ డబుల్ లైన్ పనులకు మోర్తాడ్ మార్కెట్ వద్ద, వడ్యాట్ గ్రామంలో శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది పనుల పరంపర నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు. మోర్తాడ్ ప్రాంత రైతులకు ప్యాకేజీ 21 ద్వారా ప్రతి 3 ఎకరాలకు ఒక ఔట్లెట్ పెట్టి, మిషన్ భగీరథ లాగా ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చినట్టు వ్యవసాయ పొలాలకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వర్షాలు రాకున్నా సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.
కేసీఆర్ రైతు బంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కరువు కాలంలో కూడా కాళేశ్వరం నీళ్లు ఇస్తూ రైతులకు భరోసాగా నిలబడితే కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో రైతులకు హాని తలపెట్టే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అనవసరంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నడు, మేమొస్తే 3గంటల కరెంట్ ఇస్తమని కాంగ్రెస్ వాళ్లు అన్యాయంగా, దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి పూట 3గంటల కరెంట్ ఇచ్చి రైతులను గోసపెట్టిన పాత రోజులు మళ్ళీ మనకు కావాలా..? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాటలపై రైతులు ఆలోచన చేయాలని మంత్రి కోరారు.
రైతులంతా ఓకే కులం..పార్టీలతో రైతులకు సంబంధం ఉండదన్నారు. మంచి చేస్తున్న కేసిఆర్ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా రైతులు, ప్రజలు కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామాల్లో విస్తృత చర్చ జరగాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కోటపాటి నర్సింహ నాయుడు,స్థానిక ప్రజాప్రతినిధులు,మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.