నిజామాబాద్ : మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన దరిమిలా ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావొద్దని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula)ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ (CM KCR ) ఆదేశాల మేరకు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు, క్షేత్ర స్థాయిలో వాటిని పరిశీలించారు.
కమ్మర్పల్లి మండల కేంద్రములోని కేజీబీవీ స్కూల్ (KGBV ) చుట్టూ వరద నీరు చేరడంతో విద్యార్థినులను అక్కడ నుంచి పక్కనే ఉన్న ఎంపీడీవో కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా గురువారం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారికి భోజన సౌకర్యం ఇతర అవసరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు, స్థానిక సర్పంచ్కు సూచించారు.
వరద తగ్గాక వారి స్వస్థలాలకు పంపించాలని అధికారులను ఆదేశించారు . ఎస్సారెస్పీ (SRSP) బ్యాక్ వాటర్లో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను కోరారు. పొంగి పొర్లుతున్న వాగులు,చెరువుల వద్దకు ప్రజలు, రైతులు వెళ్లవద్దని సూచించారు. జోరు వానలో ప్రయాణాలు మానుకోవాలన్నారు.