మారేడ్పల్లి, నవంబర్ 30: రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరిగాయని, పోలీస్ యంత్రాంగం కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మారేడ్పల్లి లోని కస్తూర్భా గాంధీ కళాశాలలో ఓటు వేసిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విలేకర్లతో మాట్లాడారు. హైదరాబాద్ మినీ ఇండియా అని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రగతి భవిష్యత్లో మరింత ముందుకు సాగుతుందన్నారు. 9 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మన కండ్ల ముందే కనిపిస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో అందరికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం కల్పించిందన్నారు.
ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలను తెలంగాణ సమాజం హక్కున చేర్చుకుందని, ప్రజలందరూ ఈ రోజు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈ సంతోషం ఎల్లప్పుడూ కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను, ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి సూచించారు. హైదరాబాద్లో ఓటు వేయడానికి ప్రజలందరూ ఈ సారి పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారని వెల్లడించారు.