మునుగోడు: ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే కుట్రలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మునుగోడులో ఇవాళ ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ లక్ష్యమా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కేంద్రంలోని దుర్మార్గపు BJP ప్రభుత్వం కూల్చిందని విమర్శించారు.
అధికార దాహంతోనే బీజేపీ నేతలు ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగడుతున్నారని మంత్రి తలసాని దుయ్యబట్టారు. డిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు యత్నించారని, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఆశచూపారని, ఇన్ని కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ తీరు దొంగే దొంగదొంగ అన్నట్లుగా ఉందని, ఎందుకంటే చేసిందంతా చేసిన బీజేపీ.. ఇప్పుడు నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు, చట్టాలు, వ్యవస్థల పనితీరు గురించి రాజ్యాంగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పష్టంగా వివరించారని మంత్రి తలసాని తెలిపారు. బీజేపీ నేతల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఇకనైనా రాజ్యాంగాన్ని గౌరవించి బీజేపీ నేతలు తమ పద్ధతి మార్చుకోవాలని మంత్రి హితవు పలికారు.