RRR | హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర ఖ్యాతిని RRR చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Minister Talasani Srinivas Yadav ) అన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున RRR బృందానికి సన్మానం చేయాలని నిర్ణయించామని తెలిపారు.
సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో FDC చైర్మన్ అనిల్ కూర్మాచలంతో కలిసి మాట్లాడారు. RRR చిత్రానికి ఆస్కార్ అవార్డ్ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి తలసాని, FDC చైర్మన్ అనిల్, FDC ED కిశోర్ బాబు కలిసి జర్నలిస్టులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డును అందుకున్న ఏకైక తెలుగు చలనచిత్రంగా RRR చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలుగు రాష్ట్రాలు, దేశం గర్వపడుతుందని చెప్పారు. ఆస్కార్ అవార్డును అందుకున్న గొప్ప చిత్రం RRR. ఈ చిత్రాన్ని నిర్మించిన డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మొదటి నుండి కూడా దక్షణాది రాష్ట్రాలు అంటే చిన్నచూపు అని మంత్రి విమర్శించారు. ఆస్కార్ అవార్డుల కోసం ఎంట్రీ పంపండి అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా చెలో షో ను ఆస్కార్ ఎంట్రీకి పంపించారని ఆరోపించారు. కానీ వారికి గుణపాఠం చెప్పినట్లుగా RRR చిత్రం ఆస్కార్కు ఎంపికైనదన్నారు. చిత్ర దర్శకులు రాజమౌళి కృషితోనే ఆస్కార్ అవార్డ్ దక్కిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సినిమా రంగానికి తెలంగాణా కేరాఫ్ అడ్రస్గా మారిందని చెప్పారు. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటూ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు.