Minister Srinivas Yadav | గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకువస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని షేక్పేటలో రూ.60లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవన పనులను స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలకు ఎంతో ఘనత చరిత్ర ఉందన్నారు.
విజ్ఞాన భాండాగాలుగా విలసిల్లిన గ్రంథాలయాల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించకపోవడం, సౌకర్యాలు, వసతుల గురించి పట్టించుకోని కారణంగా గ్రంథాలయాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో ఉన్న గ్రంథాలయాల్లో అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన మరమ్మతులు చేపట్టడం, శిథిలావస్థలో ఉన్న, అద్దె భవనాల్లో కొనసాగుతున్న 14 గ్రంథాలయాలకు రూ.9.40 కోట్ల వ్యయంతో నూతన భవనాలను నిర్మిస్తున్నట్లు వివరించారు.
ప్రధాన లైబ్రరీల్లో ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ను సైతం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తూ వస్తుందని తెలిపారు. ఈ గ్రంథాలయాలు పరిసరాల ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, కార్యదర్శి పద్మజ తదితరులు పాల్గొన్నారు.