హైదరాబాద్ : ఏ సామాజిక వర్గమైన ఐక్యతగా ఉంటే ఆర్థికంగా, సామాజిక, రాజకీయంగా అభివృద్ధి సాధించవచ్చని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ లో శ్రీ కృష్ణ భారతీయ యాదవ సేవాసమితి ఆవిర్భావ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు యాదవులను కేవలం ఓటు బ్యాంకు(Vote Bank)లాగానే చూశాయని, రాజకీయంగా సరైన ప్రాధాన్యత కల్పించలేదని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు( Chief Minister KCR ) నాయకత్వంలో రాజకీయంగా, సామాజికంగా యాదవుల అభివృద్దికి పెద్దపీట వేసిందని చెప్పారు. గొర్రెల పెంపకాన్ని(Sheep Units) ప్రోత్సహించేందుకు గాను సుమారు రూ. 11 వేల కోట్ల వ్యయంతో యాదవులు, కుర్మలకు గొర్రెల యూనిట్ల పంపిణీ ని చేపట్టిందని వివరించారు. కోకాపేట లో యాదవులు, కుర్మలకు వేరువేరుగా సంక్షేమ భవనాల కోసం 5 ఎకరాలు చొప్పున భూమి, నిర్మాణం కోసం రూ. 5 కోట్ల చొప్పున నిధులను విడుదల చేసిందని, భవన నిర్మాణాలు పూర్తికావచ్చాయని వెల్లడించారు .
యాదవులు ఎంతో గొప్పగా జరుపుకొనే సదర్ వేడుకలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కృష్ణాష్టమి వేడుకలను కూడా అన్ని ప్రాంతాలలో ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, శ్రీ కృష్ణ భారతీయ యాదవ సేవాసమితి అధ్యక్షుడు కాటం నరసింహ యాదవ్, అశోక్ యాదవ్, పాండు యాదవ్, మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.