హైదరాబాద్ : కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వారి అభివృద్ధికి చేయూతనిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) స్పష్టం చేశారు. బుధవారం సనత్ నగర్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, అంబర్ పేట నియోజక వర్గాలకు చెందిన 1200 మంది BC కులవృత్తి దారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఒకొక్కరికి లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఈ ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతనే హైదరాబాద్ నగరంలో బస్తీ, కాలనీ అనే తేడా లేకుండా కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, ప్రజల సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నదని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే తెలంగాణా ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుంటే, వాటిని చూడలేని BJP, కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 55 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఏం మేలు చేశారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపినాద్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, బీసీ కార్పోరేషన్ అధికారి ఆశన్న, తదితరులు ఉన్నారు.