హైదరాబాద్ : పేదలు గొప్పగా ఉండాలన్నదే తమ లక్ష్యమని సనత్ నగర్ అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మారావు నగర్, నాగదేవత టెంపుల్, ఈశ్వరమ్మ బస్తీ, హమాలీ బస్తీ, చిదానందం కాలనీ తదితర ప్రాంతాలలో పాదయాత్రగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈశ్వరమ్మ బస్తీ, పద్మారావు నగర్ ఏరియా బస్తీల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కనుక.. మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు.
నిరుపేదలు అత్యధికంగా నివసించే హమాలీ బస్తీలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎన్నికలు పూర్తయిన తర్వాత చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. బస్తీ వాసుల సౌకర్యార్ధం మీకు అందుబాటులో బస్తీ దవాఖానా ను ఏర్పాటు చేశామన్నారు. మీకు ఏ అవసరం వచ్చినా..ఏ ఆపద వచ్చినా అన్నింటికీ నేను అండగా నిలుస్తూ వచ్చానని గుర్తుచేశారు.
కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంత్రి వెంట ప్రచారంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, పద్మారావు నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అద్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ఏసూరి మహేష్, పాష, యాదగిరి యాదవ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, హమాలీ బస్తీ అద్యక్షుడు సుభాష్, సత్యనారాయణ, సంపత్ తదితరుల ఉన్నారు.