హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో బీజేపీ నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) మండిపడ్డారు. గురువారం ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. దేశంలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వివరించారు.
స్వయం పాలనలో పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ అన్ని మౌలిక సౌకర్యాలు, వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల ఇండ్లను, GHMC పరిధిలో లక్ష ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం లబ్దిదారుడిపై ఒక్క పైసా భారం లేకుండా ఉచితంగా నిర్మించి ఇస్తుందని వివరించారు.
కేంద్రమంత్రిగా, రాష్ట్ర BJP అధ్యక్షుడిగా బాధ్యాతాయుతమైన పదవులలో ఉన్న కిషన్ రెడ్డి కి అధికారికంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ అలా కాదని రోడ్డుపై బైఠాయించాల్సిన అవసరం ఏముందని, ఏం ఆశించి ఎందుకోసం ఈ రాద్దాంతం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఈ ఆందోళన ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియాలన్నారు.
నిజంగా పేదలకు మేలు చేయాలనే ఆలోచన మీకు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు నిధులు తేలేకపోతున్నారని ప్రశ్నించారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నంలో భాగంగానే రోడ్డుపై అర్ధం లేని ఆందోళన చేపట్టారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రశంసించిన విషయం వాస్తవం కాదా ? అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇక నైనా తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.