హైదరాబాద్ : గడిచిన పది సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు. బుధవారం అమీర్పేటలోని ఎస్ఆర్టీ, ముస్లిం బస్తీ, బాపూ నగర్ తదితర ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బాపూ నగర్ వాసులు సంత్ సేవాలాల్ జెండాను మంత్రికి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో సనత్ నగర్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. ప్రజల అవసరాలను, ఇబ్బందులను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. బాపూ నగర్లో గతంలో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, తాము వచ్చిన తర్వాతనే రోడ్ల నిర్మాణం డ్రైనేజీ లైన్ లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అదేవిధంగా బాపూనగర్ వాసుల కోరిక మేరకు ఈఎస్ఐ గ్రేవ్ యార్డ్ వద్ద అవసరమైన స్థలం కేటాయించినట్లు చెప్పారు. ప్రచారంలో ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలను ఎప్పటికి మరువలేను అన్నారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, జనరల్ సెక్రెటరీ సంతోష్, నాయకులు అశోక్ యాదవ్, బాపు నగర్ బస్తీ అధ్యక్షుడు హరి సింగ్, నాయకులు గోపిలాల్ చౌహాన్, బాసా లక్ష్మి, లలితా చౌహాన్, సురేందర్ సింగ్, సుమిత్ సింగ్, ఉత్తమ్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.