హైదరాబాద్ : త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా యాదవ, కురుమల ఆత్మగౌరవ భవనాలను ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కోకాపేటలో నిర్మిస్తున్న యాదవ భవనం నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, షీఫ్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కుడా చైర్మన్ సుందర్ రాజ్, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు నోముల భగత్, జైపాల్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కలెక్టర్ అమయ్ కుమార్, సీఈ అనిల్ కుమార్, యాదవ సంఘం నాయకులు చింతల రవీందర్ యాదవ్ తదితరులతో కలిసి భవనాలను పరిశీలించారు.
అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గొల్ల, కురుమల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 41 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాలకోసం స్థలాలను కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. యాదవ, కురుమ భవనాల నిర్మాణం కోసం ఒక్కో దానికి ఐదెకరాల భూమి, రూ.5 కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఒక్క యాదవ, కురుమ భవనాలు మాత్రమే నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసుకుంటున్నాయని చెప్పారు. నిర్మాణ పనులు ముగింపు దశకు చేరాయని తెలిపారు.
రాజకీయంగా, సామాజికంగా గొల్ల, కురుమలకు పెద్దపీట వేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఐదుగురికి ఎమ్మెల్యేలుగా, రాజ్యసభ, కార్పోరేషన్ చైర్మన్ చైర్మన్లుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా బీఆర్ఎస్ అవకాశం కల్పించిందని తెలిపారు. అంతేకాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. సామాజికంగా యాదవ, కురుమలు అత్యధిక జనాభా కలిగి ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే చూశారని విమర్శించారు. యాదవ, కురుమల అభివృద్ధికి ఎంతో తోడ్పాటనందిస్తున్న సీఎంకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ యాదవ, కురుమల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.