సియోల్, జూలై 5 : దక్షిణ కొరియాలో ఉన్న అద్భుతమైన పర్యాటక సొబగులను తెలంగాణలోనూ తీర్చిదిద్దడంతో పాటు సియోల్ నగరంలో ఉన్న చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్ (Amusement Park) తరహాలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనూ తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(minister srinivas goud )తెలిపారు. మంగళవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో పర్యాటకశాఖ ఎండీ మనోహర్, అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. సియోల్ నగరంలోని డి- మిలిటరీ జోన్ సమీపంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్ ఎంతో అద్భుతంగా ఉందని.. ప్రపంచ పర్యాటకులను ఈ పార్కు ఎంతగానో ఆకర్షిస్తున్నదని మంత్రి కొనియాడారు.
సియోల్ నగరంలో ఉన్న ఈ చిల్డ్రన్ అమ్యూజ్మెంట్ పార్క్ తరహాలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో రాబోయే 5 నెలల్లో నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి కూడా తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. శిల్పారామం వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈ అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేస్తామని..చిన్నపిల్లలు యువతను ఈ పార్క్ ఎంతగానో ఆకట్టుకోనుందని ఆయన వెల్లడించారు.
పార్క్ నిర్వాహకులను పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాన్ని రాష్ట్రంలోనే ప్రఖ్యాత టూరిజం డెస్టినేషన్ గా మార్చడమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. సియోల్ తరహా అమ్యూజ్మెంట్ పార్క్ ను మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాదులోనూ ఇదే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ట్యాంక్ బండ్, సస్పెన్షన్ బ్రిడ్జ్, ఐలాండ్, శిల్పారామం, కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్, టెంట్ సిటీ, మన్యంకొండ రోప్ వే తదితర టూరిజం అట్రాక్షన్స్ తో మహబూబ్ నగర్ కు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చేలా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు.