హన్వాడ, నవంబర్ 23 : కుల, మతాల పేరిట చిచ్చుపెట్టేవారితో జాగ్రత్తగా ఉండాలని మహబూబ్నగర్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్గౌడ్ (Minister Srinivas Goud) సూచించారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 55 ఏండ్లు అధికారంలో ఉండి కనీసం తాగు నీళ్లు కూడా ఇవ్వలేకపోయిందన్నారు. కులం పేరిట కాంగ్రెస్ నేతలు, మతం పేరిట బీజేపీ నేతలు ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్నారు.
మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరి నుంచి ఎకరాకు ఏడాదికి రూ.16వేలు రైతుబంధు అందిస్తామన్నారు. బీఆర్ఎస్ సర్కారు వస్తే దళితుల భూములను తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారని.. దళితుల భూమి సెంటు పోయినా తనదే బాధ్యత అని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీని కట్టబెట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.