మహబూబ్నగర్ : ఆ బాలుడి పేరు విజయ కుమార్. తల్లిదండ్రులు మల్లెల వెంకటేష్, మల్లెల బుజ్జమ్మ. వీరిది కాకర్లపాడ్. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేక బడికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో మహబూబ్నగర్ పట్టణంలోని మైసమ్మ వద్ద కూల్ డ్రింక్స్ అమ్ముతున్నాడు. ఆదివారం నాడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మైసమ్మ వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. కూల్ డ్రింక్ విక్రయిస్తున్న బాలుడు విజయ కుమార్… మంత్రిని చూసి వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళి చేయిపట్టుకుని నన్ను చదివించండి సర్ అంటూ ఏడ్చేశాడు. పిల్ల వాడి ఆర్తి మంత్రిని కదిలించింది.
చదువు పట్ల విజయ్కున్న శ్రద్ధను మంత్రి గమనించి వెంటనే బాలుడిని తన వాహనంలో ఎక్కించుకున్నాడు. తన పక్కనే కూర్చోబెట్టుకుని అన్ని వివరాలు తెలుసుకున్నారు. అక్కడికక్కడే పట్టణంలో మంచి పేరున్న రిషి విద్యాలయం వాళ్లకు ఫోన్ చేసి బాలుడిని ఆరో తరగతిలో చేర్చుకుని హాస్టల్ వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బాలుడికి అవసరమైన దుస్తులు, ఇతర వస్తువులన్నీ కొనివ్వండని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు.
బాలుడిని జీవితంలో స్థిరపడేలా చేస్తామని అంత వరకు తానే బాధ్యత తీసుకుంటానని మంత్రి స్పష్టం చేశారు. తన సొంత కుమారుడిలా విద్యాబుద్ధులు అందిస్తామని తెలిపారు. బాలుడి తల్లితండ్రులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. బాలుడు తన వద్దకు వచ్చి అడిగిన విధానం, చదువు పట్ల బాలుడికి ఉన్న శ్రద్ధ తనను కదిలించిందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బాలుడు జీవితంలో ఉన్నతంగా స్థిరపడేలా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.