హైదరాబాద్ : టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో తెలంగాణకు చెందిన క్రీడాకారిణి నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ ప్రదర్శనతో తెలంగాణ రాష్ట్ర కీర్తిప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో మారుమోగించిన క్రీడాకారిని తండ్రి జమీల్ అహ్మద్ను హైదరాబాద్లోని తన కార్యాలయంలో మంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచ చాంపియన్షిప్లో సుమారు 75 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారని, అందులో నిఖత్ జరీన్ అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రంతో పాటు దేశానికి గర్వకారణమన్నారు. అంతర్జాతీయ స్థాయి వేదికలపై పతకాలు సాధించిన క్రీడాకారులకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగదు పురస్కారాలను క్రీడాశాఖ ద్వారా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచ చాంపియన్గా నిలిచిన నిఖత్ జరీన్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని నిఖత్ జరీన్ తండ్రికి మంత్రి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీజీవో కేంద్ర సంఘం ప్రతినిధులు పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, సహదేవ్, గండూరి వెంకట్, స్పోర్ట్స్ స్కూల్ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ, వెంకటయ్య పాల్గొన్నారు.