మహబూబాబాద్ : తెలంగాణ బీజేపీ ఎంపీలపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి బీజేపీలో ఎంపీలుగా ఉన్న ఆ నలుగురు తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ ఆత్మగౌరవం, పౌరుషం వారి రక్తం ప్రవహిస్తే.. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే బీజేపీ మోచేతి నీళ్లు తాగడం, ఎంగిలి కూడు తినడం మానేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని డిమాండ్ చేశారు.
ఆదివారం నర్సింహుల పేట మండలం, పెద్ద నాగారం గ్రామం కే.ఎస్.కే ఫంక్షన్ హాల్లో చెల్లమల్ల సర్వయ్యకొడుకు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ అంటేనే భారతీయ ఝూటా పార్టీ అని, అబద్ధాలకు మారుపేరుగా మారిందన్నారు. బీజేపీ గడిచిన 8 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి చేసింది శూన్యమని, పైగా నిత్యం తెలంగాణ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. అబద్ధపు మాటలు చెప్పి రాష్ట్రంలో ఆ నలుగురు ఎంపీలు బీజేపీ నుంచి గెలిచి ఇప్పుడు మిడిసిపడుతున్నారన్నారు. ఇది ఇలాగే కొనసాగితే వారు చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. బండి సంజయ్ సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎంను విమర్శించే స్థాయికి వారికి లేదన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్ సోయి ఉండి మాట్లాడితే మంచిదని హితవు పలికారు.
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇక్కడి పేదోళ్ల కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చి తెలంగాణ అభివృద్ధిలో ఏమైనా పాత్ర పోషించారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ది ఉంటే ప్రజా సంగ్రామ యాత్ర కాదు..ఈ సంగ్రామ యాత్రను ఢిల్లీ పెద్దల మీద, కేంద్రం మీద చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కొమ్మినేని రవీందర్, రామ్ లాల్ ఉన్నారు.