గంగారం(మహబూబాబాద్) : గంగారం మండలంలోని పూనుగుండ్ల గ్రామంలోని పగిడిద్ద రాజు దేవాలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు, జిల్లా కలెక్టర్ శశాంక సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ సాంప్రదాయ ప్రకారం అతిథులను పూజారులు, గ్రామస్తులు సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిరంతరంగా కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా మేడారం జాతరకు 2016, 2018, 2020 సంవత్సరాల్లో రూ.350 కోట్ల నిధులను వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు.
మేడారం జాతర సందర్భంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు గాను జంపన్నవాగులో చెక్ డ్యామ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, భక్తులకు షెడ్స్ నిర్మాణాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్లు కేటాయించిందని మంత్రి సత్యవతి గుర్తు చేశారు. అదేవిధంగా భక్తులు చిన్న జాతరలు కూడా నిర్వహించుకుంటూ ఉన్నందున గిరిజన ప్రాంతాలలోని ఆలయాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో రూ. ఒక కోటి ఇరవై లక్షలు కేటాయించామన్నారు.
అందులో భాగంగా గుంజేడు ముసలమ్మ దేవాలయ అభివృద్ధి పనులకు రూ. 24 లక్షలు, పూనుగొండ్ల గ్రామంలోని వన దేవత అయిన పగిడిద్దరాజు దేవాలయ అభివృద్ధి పనులకు రూ. 32 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. అలాగే పస్రా నుండి మేడారం వరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రభావిత ఏడు గ్రామాలలో కూడా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. తాగునీటి సౌకర్యం కొరకు మరో మూడు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.