హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బంది వేతనాలను ఒకసారి పరిశీలిస్తే.. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చెబుతున్న తొండి లెక్కలు, ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మేలు నీళ్లకు నీళ్లు, పాలకు పాలుగా స్పష్టంగా కనిపిస్తాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
నిత్యం సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ వల్లించే ప్రధాన మంత్రి రోజురోజుకు తన బాధ్యతల నుంచి తప్పుకుంటూ సబ్ కా విఘాత్ కలిగిస్తూ ఉద్యోగుల వెన్ను విరుస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. అంగన్వాడీల విషయంలో కేంద్రం ధోరణి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. మహిళా,శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లో ఈ అంశాలపై శుక్రవారం నాడు మంత్రి సమీక్ష నిర్వహించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల వేతనాలను 2018 సెప్టెంబర్లో ఒకసారి మాత్రమే పెంచారని ఆమె గుర్తుచేశారు. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అంగన్వాడీల వేతనాలను మూడు సార్లు పెంచారని వెల్లడించారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్రం వాటా 10శాతం ఉండగా.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం వాటాను 90 నుంచి 60 శాతానికి తగ్గించిదన్నారు. రాష్ట్రాల వాటాను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుని కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుందన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం పెరిగిన వేతనాల ప్రకారం కేంద్రం వాటా 60 శాతం ఉండాల్సి ఉండగా, అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో 19 శాతం, అంగన్వాడీ హెల్పర్ల వేతనాల్లో 17 శాతం మాత్రమే కేంద్రం ఇస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వేతనాలకు తన వాటా కింద 40 శాతం వాటా ఇవ్వాల్సి ఉండగా అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే వేతనాల్లో రాష్ట్రం వాటా 80 శాతం, అంగన్వాడీ హెల్పర్ల వేతనాల్లో 82 శాతం ఉండడం ముఖ్యమంత్రి కేసీఆర్ ఔదార్యానికి, అంగన్వాడీల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమన్నారు.
అంగన్వాడీలు అందిస్తున్న సేవలను గుర్తించి ఈ ఏడాది అక్టోబర్ నెలలో వారి జీతాలను 30 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈ ఏడాది జూలై నుంచే అమలు చేస్తామని ప్రకటించారని, పెంచిన వేతనాలు డిసెంబర్ నుంచి అంగన్వాడీ ఉద్యోగుల ఖాతాల్లో పడుతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాని అన్నారు. దీనివల్ల 67,411 మంది అంగన్వాడీ ఉద్యోగులు లబ్ది పొందుతారన్నారు. రాష్ట్రంలో ఇందుకోసం అంగన్వాడీల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ణతలు తెలిపారు.
ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర నేతలు జూఠా మాటలు మాట్లాడడం, గాలి మాటలు చెప్పడం మానేసి నిర్దిష్టంగా కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న మేలు చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాటిని సమర్ధిస్తూ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని హితవు పలికారు. ఢిల్లీ బాసుల మెప్పు పొందడానికి
బీజేపీ రాష్ట్ర నేతలు నిత్యం అబద్దాలు చెబుతూ అయోమయానికి గురి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలు కూడా వారి మాయలో పడొద్దని, ఎక్కడికక్కడ వాస్తవాలను అంకెలు, జీవోలతో బయటపెట్టాలని వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగులు కేంద్రం చేసిన నిర్వాకాన్ని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మేలును గుర్తించాలని, బీజేపీ నేతల అబద్దపు ప్రచారాలను తిప్పి కొట్టాలని కోరారు.