మహబూబాబాద్ : సీరోలు గ్రామంలో ఏకలవ్య ఆదర్శ గురుకుల బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని కొంతమంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైన నేపథ్యంలో నేడు మంత్రి సత్యవతి రాథోడ్ ఆ పాఠశాలకు వెళ్లి, పరిస్థితులను సమీక్షించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను మంత్రి పరామర్శించి, ధైర్యం చెప్పారు. విద్యార్థులకు భోజనం అందిస్తున్న సరుకులను, వంటశాలను సత్యవతి రాథోడ్ స్వయంగా తనిఖీ చేసి చూశారు. విద్యార్థులతో కలిసి అక్కడే టిఫిన్ చేశారు.
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. సీరోలు గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలిసిన వెంటనే కలెక్టర్, జిల్లా అధికారులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పానని తెలిపారు. దాదాపు 38 మంది విద్యార్థులు కలుషితాహారం తినడం వల్ల వాంతులు, విరోచనాలతో ఇబ్బందికి గురయ్యారు. అయితే వెంటనే వైద్య సేవలు అందించడం వల్ల అందరూ బాగున్నారు. ఇంకో 14 మంది విద్యార్థులు నీరసంగా ఉండడంవల్ల వారిని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ చేర్పించి వైద్యం అందిస్తున్నాం.
నిన్న రాత్రి పిల్లలు చికిత్స పొందుతున్న జిల్లా ఏరియా హాస్పిటల్ వెళ్లి వారిని పలకరించాను. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారంతా కోలుకున్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి స్పష్టం చేశారు.
నిన్న జరిగిన సంఘటనలో లోపం ఎక్కడుందో గుర్తించి, సరి చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు కూడా ఉద్దేశపూర్వకంగా ఇది జరిగింది కాదని, రోజులాగే తిన్నామని తర్వాత హఠాత్తుగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయని చెప్పారు. దీనిపై విచారణ జరిపిస్తున్నామని మంత్రి సత్యవతి పేర్కొన్నారు. ఈ తనిఖీలో మంత్రితోపాటు కలెక్టర్ శశాంక, జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, జిల్లా అధికారులు, స్థానిక నేతలు ఉన్నారు.