హైదరాబాద్, డిసెంబర్29 (నమస్తే తెలంగాణ): సాహితీమూర్తుల స్మరణ ఈ తరానికి మంచి ప్రేరణగా నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి సబిత పేర్కొన్నారు. సాహితీవేత్తల విశిష్టతలు, వారు సాహిత్యానికి చేసిన కృషిని తెలియజేస్తూ రూపొందించిన తెలంగాణ తేజోమూర్తుల జయంతుల క్యాలెండర్ను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్తో కలిసి గురువారం ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్యాలయాల్లో ప్రతి రోజూ అసెంబ్లీలు జరుగుతున్నాయని, వాటిలో తెలంగాణ సాహితీమూర్తుల జయంతులను నిర్వహించాలని సూచించారు.
మఖ్దూం మొహియుద్దీన్, సుద్దాల హన్మంతు, దేవులపల్లి రామానుజరావు, దాశరథి, బిరుదురాజు రామరాజు, భాగ్యరెడ్డివర్మ, పీవీ, సామల సదాశివ, కపిలవాయి లింగమూర్తి తదితర సాహితీమూర్తుల చరిత్రను పిల్లలకు ఉపాధ్యాయులు పరిచయం చేస్తున్నారని చెప్పారు. అనంతరం జూలూరు మాట్లాడుతూ.. కొత్త సంవత్సరం నుంచి పాఠశాల ప్రార్థనా సమయాల్లో తెలంగాణ తేజోమూర్తుల జయంతులు, వర్ధంతులను నిర్వహించడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఎన్ బాలాచారి, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.