హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/కందుకూరు, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామం.. ఇదేదో మంత్రులు, ఎమ్మెల్యేలు అన్న మాట కాదు. స్వయానా విదేశీ ప్రతినిధి నోట వచ్చిన ప్రశంస ఇది. రాష్ట్రంలో శాంతిభద్రతలతోపాటు అన్నిరకాల మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నందునే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చామని, ఈ పెట్టుబడులను ఇంకా కొనసాగిస్తామని అమెజాన్ వెబ్ సర్వీస్ ఆసియా-పసిఫిక్, జపాన్, చైనా డాటా సెంటర్ ఆపరేషన్స్ డైరెక్టర్ సాజీ పీకే కొనియాడారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఆధునీకరించిన నేదునూరు జడ్పీ ఉన్నత పాఠశాల, తెలంగాణ స్టేట్ మాడల్ స్కూల్ను శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ర్టానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నదన్నారు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయి.
కరెంటు సరఫరా అద్భుతంగా ఉన్నది. సామాజిక-ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి. అందుకే ఇక్కడకు వచ్చి పెట్టుబడులు పెట్టాం. మున్ముందు ఈ ప్రాంతంలో మరిన్ని పెట్టుబడులను కొనసాగిస్తాం’ అని సాజీ స్పష్టం చేశారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన ఇద్దరు విద్యార్థినులను చూస్తే చాలా గర్వంగా ఉన్నదన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం గురుకులాల ద్వారా నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. మన ఊరు-మన బడి స్ఫూర్తితో పాఠశాల అభివృద్దికి అమెజాన్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, గణితం వంటి విభాగాలపై విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేలా రూపొందించిన ఏడబ్ల్యూఎస్ థింక్ బిగ్ స్పేస్ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు ఉదయం అల్పాహారంలో భాగంగా పోషకాహారాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా సాజీ, మంత్రి సబిత ఇంద్రారెడ్డి ప్రారంభించారు. గ్రామ సర్పంచు కాసుల రామక్రిష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు తదితరులు పాల్గొన్నారు.