నవాబ్పేట్, ఏప్రిల్ 6: సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో కేంద్రానికి కండ్లు మండి కుట్రలకు తెరలేపిందని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. బుధవారం ఆమె వికారాబాద్ జిల్లా నవాబ్పేట మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాట్లాడారు. రైతులపై కక్షగట్టిన బీజేపీని తెలంగాణ నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉన్నదన్నా రు. కేంద్రం యాసంగిలో వడ్లు కొనబోమని చెప్పినందున వరి వద్దని సీఎం కేసీఆర్ పిలుపునిస్తే అందుకు విరుద్ధంగా వరి వేయాలని బీజేపీ నేతలు రైతులను రెచ్చగొట్టారన్నారు. ఇప్పుడు రైతులు ఇబ్బందుల్లో ఉంటే.. అప్పుడు రెచ్చగొట్టిన బీజేపీ నేతలు ఎక్కడ అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తూ వడ్లు కొనబోమంటున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై యుద్ధం చేస్తున్నామన్నారు. ఈ ధర్మ పోరాటంలో రైతన్నలు సీఎం కేసీఆర్ ప్రభుత్వంతో కలిసి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.