ఖమ్మం, నవంబర్ 23 : ఖమ్మం ప్రజలందరూ అభివృద్ధి వెంటే ఉన్నందున్న ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపును మరెవ్వరూ ఆపలేరనిరవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada) తేల్చిచెప్పారు. తాను ఇక్కడి వాడిని కాబట్టే, ఇక్కడి ప్రజల కష్టాలు తెలిసిన వాడిని కాబట్టే ఖమ్మాన్ని అద్భుతంగా తీర్చిదిద్దానని, ప్రజల కష్టాలకు పరిష్కారం చూపానని గుర్తుచేశారు.
ఖమ్మం నగరంలో గురువారం పర్యటించిన ఆయన.. పలు డివిజన్లలో ఆత్మీయ సమ్మేళనాలు, ఇంటింటి ప్రచారాలు, రోడ్షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించానని, అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలిపానని అన్నారు. ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తెచ్చి నిర్విరామంగా పనిచేయడం వల్లనే ఇంతటి ప్రగతి సాధ్యమైందని అన్నారు. మంత్రిగా ఉండి కూడా అధికారులను వెంటబెట్టుకొని నగరంలోని ప్రతి వీధినీ పరిశీలించానని అన్నారు.
ఇంతకుమునుపు మంత్రులెవరూ ఇలా సైకిళ్లపై తిరిగి పనులు చేయలేదని గుర్తుచేశారు. ఇదే కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గతంలో టీడీపీ ప్రభుత్వంలోనూ, ఆ తరువాత ఇక్కడి ఎమ్మెల్యేగానూ పనిచేసినప్పటికీ అప్పుడు ఖమ్మాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో మొదటి బ్యాలెట్లో మొదటి సంఖ్యలో ఉన్న కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.