హైదరాబాద్ : వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుల కోసం టెండర్లు పిలవడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ పరిధిలో క్షేత్రస్థాయిలో పనులను మరింత పటిష్టపరిచేందుకు చేపట్టవలసిన అభివృద్ధి కార్యాచరణపై శుక్రవారం హైదరాబాద్లోని న్యాక్ ప్రధాన కార్యాలయంలో ఆర్ అండ్ బి ఉన్నతాధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకొని, వర్షాలు, వరదలకు పాడైయిన రోడ్లను ఎప్పటికప్పుడు మరమత్తులు చేసుకునే విధంగా క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని మంత్రి వేముల అధికారులతో అన్నారు. రోడ్ల నిర్వహణ పట్ల పకడ్బందీగా వ్యవహరించాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. శాఖలో పరిపాలన సంసరణలు అమలుకై ముఖ్యమంత్రి సూచించిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి ఐదు లేదా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎస్ఈ ఉండే విధంగా, టెరిటోరియల్ సీఈలను కూడా నియమించుకోవాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.