మహబూబ్ నగర్ : ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ధ్యేయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రం సమీపంలో ఊక చెట్టు వాగులో సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో చింతకుంట నుంచి కురుమూర్తి వరకు నిర్మించనున్న కాజ్ వే కు, చెక్ డ్యామ్ పనులకు భూమి పూజ చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గడచిన 70 సంవత్సరాలలో తెలంగాణ వివక్షకు గురైందని, తెలంగాణ రాష్ట్రం సాధించిన ఏడేళ్లలో అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉచిత విద్యుత్ ,సాగునీరు, తాగునీరు, పెన్షన్లు, రైతుబంధు వంటి ఎన్నో అద్భుత పథకాలను అమలు చేస్తున్నాం.
ఒకవేళ ఎక్కడైనా ఎవరికైనా ఈ పథకాలు అందన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల వారు తలెత్తుకుని బ్రతకాలన్నది రాష్ట్ర సీఎం కోరికని అందుకు అనుగుణంగానే పని చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్, సర్పంచ్ విజయ్ మోహన్, భూత్ పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్, ఎంపీపీ హర్షవర్ధన్, జెడ్పిటిసి రాజేశ్వరి తదితరులు హాజరయ్యారు.