ఆదిలాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లా ముక్రా (కే) గ్రామం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రశంసించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ, జాతీయ జీవ వైవిధ్య అథారిటీ ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలో నిర్వహించిన జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ కార్యక్రమంలో ముక్రా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువుల తయారీపై స్టాల్ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ను వీక్షించిన కేంద్ర మంత్రి భూపేందర్ సేంద్రియ ఎరువు తయారీ విధానాన్ని సర్పంచ్ మీనాక్షీ గాడ్గేను అడిగి తెలుసుకొన్నారు. కేంద్ర మంత్రి సూచన మేరకు సర్పంచ్ వేదికపై మాట్లాడుతూ.. పంచాయతీల్లో పల్లె ప్రగతి ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. గ్రామంలో ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ, సెగ్రిగేషన్ షెడ్లో తడిచెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని తెలియజేశారు. ఎరువులను పంటలకు వినియోగిసున్న తీరు, హరితహారంలో భాగంగా పండ్ల మొక్కల పెంపకం, జంతువుల సంరక్షణకు చేపడుతున్న చర్యలను వివరించారు. సేంద్రియ ఎరువుల తయారీతో ఆదాయం సమకూర్చుకోవడంపై సర్పంచ్ను మంత్రి అభినందించారు. ముక్రా(కే) గ్రామం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినికుమార్, జీవ వైవిధ్య అథారిటీ అధికారులు, వివిధ రాష్ర్టాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.